బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సువేందు అధికారి
- అట్టహాసంగా జరిగిన సువేందు అధికారి ప్రమాణస్వీకారం
- హాజరైన మోదీ, అమిత్ షా, చంద్రబాబు తదితర నేతలు
- సువేందు కేబినెట్ మంత్రులుగా పలువురి ప్రమాణస్వీకారం
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ నిరీక్షణకు ఈరోజు తెరపడింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడిగా, ఆమె రాజకీయ వ్యూహాల్లో కీలక పాత్ర పోషించిన సువేందు అధికారి... ఈరోజు అదే బెంగాల్ గడ్డపై ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టిన మమత దగ్గరే రాజకీయ ఓనమాలు నేర్చుకుని, చివరకు ఆమెనే ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఒక పక్కా పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తోంది.
సువేందు అధికారి ప్రస్థానం నిజంగానే అద్భుతమని చెప్పొచ్చు. నందిగ్రామ్, భవానీపూర్ ఉద్యమాల్లో మమతకు వెన్నెముకగా నిలిచిన ఆయన, నేడు ఆమె కూర్చున్న కుర్చీలోనే ముఖ్యమంత్రిగా ఆసీనులయ్యారు. బెంగాల్ ఓటర్లు ఆయనకు పట్టం కట్టడం ద్వారా రాష్ట్రంలో ఒక కొత్త శకానికి నాంది పలికారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పలువుకు అగ్ర నేతలు స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తొలి కేబినెట్ - కీలక నేతలు:
ముఖ్యమంత్రితో పాటు బీజేపీలోని కీలక నేతలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సువేందు అధికారి టీమ్లో ఉన్న ముఖ్యమైన నేతలు వీరే...
దిలీప్ ఘోష్: బెంగాల్ బీజేపీ బలోపేతంలో కీలక పాత్ర పోషించిన నేత.
అగ్నిమిత్ర పాల్: పార్టీలో చురుకైన నాయకురాలు.
నిశిత్ ప్రామాణిక్: యువ నాయకత్వానికి నిదర్శనం.
వీరితో పాటు క్షుదీరామ్ తుడు, అశోక్ కీర్తనియా వంటి నేతలు కూడా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు.